Tuesday, 13 April 2021

పవన్ అనే సింహానికి ఈ చిట్టెలుకలు సపోర్ట్ చేస్తే ఎంత? చేయకపోతే ఎంత? టాలీవుడ్‌పై నాగబాబు ఫైర్

పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్ నటించిన ‘వకీల్‌సాబ్’ చిత్రం శుక్రవారం (ఏప్రిల్ 9న) నాడు విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సాధించింది. అయితే ఈ సినిమా టికెట్ రేట్లకి సంబంధించిన రగడ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. గత కొన్నేళ్లుగా కొత్త సినిమాలకు టికెట్ రేట్లను పెంచుతూ ప్రేక్షకుల జేబులకు చిల్లు పెడుతున్న విధానాన్ని అడ్డుకున్న ఏపీ ప్రభుత్వం.. వకీల్ సాబ్ చిత్రం బెనిఫిట్ షోలు ప్రదర్శించరాదని, టికెట్ రేట్లు పెంచవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ రేట్లు పెంచితే కఠినచర్యలు తప్పవంటూ ఓ జీవో విడుదల చేసింది. దీంతో అప్పటికే సినిమాని కొనుక్కున్న వకీల్ సాబ్ డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్ మూడ్రోజుల పాటు టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో టికెట్ రేట్లు పెంచుకోవచ్చంటూ ఉత్తర్వులు ఇచ్చిన సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ నేడు కొట్టివేసింది. టికెట్ రేట్లను పెంచొద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. మొత్తంగా ఈ వ్యవహారం జనసైనికులు, ఏపీ ప్రభుత్వానికి మధ్య మంట రాజేసింది. పవన్ కళ్యాణ్‌ని రాజకీయంగా ఎదుర్కొనలేక.. ఆయన సినిమాని అడ్డుకున్నారని.. అయినా సరే పవన్ కళ్యాణ్‌కి ప్రేక్షకుల మద్దతు ఉండటంతో సినిమా అద్భుతమైన కలెక్షన్లు రాబట్టిందని సోషల్ మీడియాలో తెగ పోస్ట్‌లు పెడుతున్నారు జనసైనికులు. అయితే ఈ వ్యవహారంలో ఇండస్ట్రీ పెద్దలు కల్పించుకోకపోవడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాని సినిమాలా చూడకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం కరెక్ట్ కాదని.. ఏ హీరోకి లేని రూల్స్ పవన్ కళ్యాణ్ విషయంలోనే ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్.. ట్విట్టర్‌లో 'వకీల్‌ సాబ్‌.. ఏపీ ప్రభుత్వ తీరుపై సినీ పెద్దలెవరూ స్పందించరా?' అంటూ ప్రశ్నించారు. అయితే మెగాబ్రదర్ మాత్రం ఈ ఇష్యూపై భిన్నంగా స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి పనులు చేసే వ్యక్తి కాదని.. ఆయన రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన విషయాలపై బిజీగా ఉన్నారని.. అయితే కొంతమంది లోకల్ లీడర్స్ కావాలనే పవన్ కళ్యాణ్ సినిమాని అడ్డుకుంటున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా ఇదే విషయంపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఇన్ స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో నాగబాబుని ప్రశ్నించారు. ‘వకీల్ సాబ్ చిత్రానికి కలెక్షన్లు రాకుండా.. టికెట్ రేట్లు పెంచకుండా ప్రభుత్వం అడ్డుకుంటుంటే.. టాలీవుడ్ పెద్దలు ఎవరూ ఎందుకు స్పందించడం లేదు’ అని అడగ్గా.. అభిమానుల ప్రశ్నపై ఘాటుగా స్పందించారు నాగబాబు. పవన్ కళ్యాణ్‌ని సింహంతో పోల్చుతూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ‘లయన్‌కి చిట్టి ఎలుకలు సపోర్ట్ చేసినా చేయకపోయినా లయన్‌కి ఏమీ ఫరక్ పడదు. అయినా సూపర్ హిట్ మూవీకి ఎవరి సపోర్ట్ అక్కర్లేదు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు నాగబాబు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా.. మెగాస్టార్, మెగా ఫ్యామిలీ అండగా నిలుస్తూ వస్తోంది. అయితే ఈ ఇష్యూలో ఇండస్ట్రీ పెద్దలు, స్టార్ హీరోలు స్పందించకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dciMRr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...