Monday 30 March 2020

‘ఆ మూడు గ్రహాలు కలుసుకోబోతున్నాయి.. బయటికి వెళ్లొద్దు’

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే కొన్ని వేలమందిని బలితీసుకుంది. లక్షల్లో ఈ వైరస్ బారిన పడ్డారు. ఇటలీ, స్పెయిన్ దేశాలు కరోనా దెబ్బకు అతలాకుతలం అయ్యాయి. అమెరికాను కూడా కోలుకోలేని దెబ్బతీసింది కరోనా. అయితే, భారత ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో పరిస్థితి ప్రస్తుతానికి చేయిజారి పోలేదు. కానీ, ఈ 21 రోజుల లాక్‌డౌన్ ప్రజలు కచ్చితంగా పాటిస్తేనే కరోనాను జయించగలం. అందుకే, ప్రజల్లో ఈ విషయం పట్ల అవగాహన కల్పించడానికి సినిమా సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. తాజాగా ప్రముఖ గాయని స్మిత దీనిపై మాట్లాడారు. వ‌చ్చే వారం రోజులు మ‌న‌కు ఎంతో కీలకమని చెప్పిన స్మిత.. వైర‌స్ బాగా వ్యాప్తి చెందడానికి అవ‌కాశం ఉన్న ఈ స‌మ‌యంలో అంద‌రూ బ‌య‌ట‌కు క‌ద‌ల‌కుండా ఎవ‌రింటిలో వారు సుర‌క్షితంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో వ‌చ్చే వారం రోజులు ఎందుకు కీల‌క‌మో ఒక వీడియో సందేశం ద్వారా ఆమె తెలిపారు. Also Read: వీడియోలో స్మిత మాట్లాడుతూ.. ‘‘అంద‌రూ మీ ఇళ్లల్లో సుర‌క్షితంగా ఉన్నార‌ని ఆశిస్తున్నా. సెల్ఫ్‌ క్వారంటైన్‌లో తొలి ఐదు రోజులు నేను బాగానే ఎంజాయ్ చేశాను. నా హాబీలు.. క్లీనింగ్‌, కుకింగ్‌, మా అమ్మాయి శివితో గ‌డ‌ప‌డం.. అన్నీ చేసేశా. వీటికి సంబంధించిన‌ వీడియోలు కూడా పోస్ట్ చేశా. ఆరో రోజు ఒక విష‌యం న‌న్ను బాగా క‌ల‌వ‌ర‌పెట్టింది. మ‌న‌మంటే నెల‌కు స‌రిప‌డా నిత్యావ‌స‌ర వ‌స్తువుల్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని వాటితో బ‌తికేయ‌గ‌లం. కానీ ఇల్లులేని వాళ్లు, దిన‌స‌రి వేత‌నంతో బ‌తికే కార్మికులు ఏమై పోతున్నారు, వాళ్ల ప‌రిస్థితేంటి? అనే ఆలోచ‌న వ‌చ్చేస‌రికి ఒకరోజంతా నిద్ర స‌రిగా ప‌ట్టలేదు, తిన‌లేక‌పోయాను. అలాంటి వాళ్లకు చాలా మంది చాలా ర‌కాలుగా సాయం చేస్తున్నార‌ని నాకు తెలుసు. ఈ సంక్లిష్ట కాలంలో తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా ప‌నిచేస్తోంది. మ‌నంద‌రం కూడా ఒక‌రికొక‌రం చేత‌నైనంత సాయం చేసుకోవాలి. ఎవ‌రింట్లో వారుండి దేశాన్ని కాపాడే స‌మ‌యం వ‌చ్చింది అని చెబుతున్నారు. అది నిజం. వ‌చ్చే వారం రోజులు మ‌న‌కు చాలా కీల‌క‌మైన‌వి. వైర‌స్ బాగా వ్యాప్తి చెందడానికి అవ‌కాశం ఉన్న కాలం ఇది. ఆస్ట్రాల‌జీ ప్రకారం చంద్రుడి మీద‌కు రాహువు వ‌స్తున్నాడు. శ‌ని, అంగార‌కుడు, గురు గ్రహాలు మూడూ క‌లుసుకోబోతున్నాయి. జ్యోతిషం ప్రకారం ఇది చాలా ప్రమాద‌క‌రం. అంటే ఆ స‌మ‌యంలో వైర‌స్ వేగంగా వ్యాప్తి చెంద‌డానికి అవ‌కాశం ఉంది. ఈ టైమ్‌లో మ‌నం బ‌య‌ట‌కు వెళ్లక‌పోవ‌డం చాలా ముఖ్యం. ఈ రోజు (మార్చి 30) రాత్రి నుంచి ఏప్రిల్ 2 వ‌ర‌కు బ‌య‌ట‌కు వెళ్లి స‌రుకులు కొన‌డం మానుకొని, ఇంట్లో ఉన్నవాటితో స‌రిపెట్టుకొంటే మంచిది. అలాగే వేడి నీళ్లలో ప‌సుపు, తుల‌సి, వాము క‌లిపి.. ఆవిరి ప‌ట్టుకుంటే వైర‌స్ దూరంగా తొల‌గిపోతుంది. ఆవిరి ప‌ట్టిన కొద్దిసేప‌టి వ‌ర‌కు అలాగే ఉండి, ఆ త‌ర్వాతే ముఖం క‌డుక్కోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల వైర‌స్ నుంచి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకున్నవాళ్లమ‌వుతాం. చెప్పిందే మ‌ళ్లీ మ‌ళ్లీ చెపుతున్నార‌నుకోవ‌ద్దు.. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం.. ఎప్పటిక‌ప్పుడు చేతులు శుభ్రంగా క‌డుక్కుంటూ ఉండండి, సామాజిక దూరం పాటించండి, ఇంట్లో ఉండండి. అంతేకాదు, ఏప్రిల్ 14 త‌ర్వాత మ‌న‌కు స్వేచ్ఛ వ‌స్తుంది, బ‌య‌ట‌కు వెళ్లవ‌చ్చు అనుకోకండి. ఇంకో ప‌దిహేను రోజులు లేదా నెల రోజులు లేదా రెండు నెల‌లు కూడా ఇంట్లోనే ఉండాల్సి రావ‌చ్చు. మ‌న‌కు తెలీదు. ప్రభుత్వం చెప్పిన స‌ల‌హాలు, సూచ‌న‌ల‌ను త‌ప్పనిస‌రిగా పాటించండి. అప్పుడే రాష్ట్రం, దేశం ప‌రిశుభ్రంగా ఉంటాయి’’ అని స్మిత వెల్లడించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WRbXwW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...