Friday, 2 April 2021

చిరంజీవి ఫాలో అవుతున్న ‘ఒకేఒక్కడు’.. మెగా ప్రేమకి రుణపడి ఉంటానంటూ భావోద్వేగ ట్వీట్

మెగాస్టార్ సోషల్‌మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ఏడాది సోషల్‌మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరు.. అప్పటినుంచి అక్కడా రఫ్పాడిస్తున్నారు. ట్విట్టర్‌కి ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే తన స్టైల్‌లో ట్వీట్లతో సెటైర్లు వేయడమే కాకుండా పలు సినిమాలకు సంబంధించిన విషయాలను ముందుగానే లీక్ చేస్తూ.. ఆయన అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నారు. చిరు ఎప్పుడు ట్వీట్ చేస్తారా.. దేని గురించి ట్వీట్ చేస్తారా.. అని అభిమానులు ఎదురుచూసేలా.. సోషల్‌మీడియాలో సందడి చేశారు మెగాస్టార్. మరోవైపు మీమ్స్ వేయడంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు చిరు. తన తదుపరి చిత్రం ఆచార్యకు టీజర్ అప్‌డేట్‌ని మీమ్ రూపంలో అభిమానులతో పంచుకొని అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే సోషల్‌మీడియాలో కేవలం వినోదాత్మక అంశాలపైనే కాకుండా.. సమాజంలో జరుగుతున్న అంశాలపై చిరు తరచూ స్పందిస్తూ ఉంటారు. దీంతో సినిమాల్లోనే కాదు.. సోషల్‌మీడియాలోనూ ఆయనే మెగాస్టార్ అంటూ అభిమానులు కొనియాడుతున్నారు. సాధారణంగా సెలబ్రిటీలను ఎవరు ఫాలో అవుతున్నారనే విషయంపై కంటే.. సదరు సెలబ్రిటీ ఎవరిని ఫాలో అవుతున్నారనే విషయంపై అందరికీ ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అయితే సాధారణంగా పెద్ద సెలబ్రిటీలు చాలా తక్కువ సంఖ్యలో వేరే వాళ్లని ఫాలో అవుతారు. వాళ్లు ఫాలో అయ్యే వారి సంఖ్య పదుల్లోనే ఉంటుంది. మరి సోషల్‌మీడియాలో ఇంతలా యాక్టివ్‌గా ఉండే చిరు ఎంతమందిని ఫాలో అవుతున్నారో తెలిస్తే షాక్ అవుతారు. చిరు సోషల్‌మీడియాలో ఫాలో అయ్యే వ్యక్తి కేవలం ఒకేఒక్కడు. తన ట్విట్టర్ ఖాతా తెరిచిన కొత్తలో చిరంజీవి తన కుమారుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌ని ఫాలో అయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. చెర్రీని కూడా అన్ ఫాలో చేశారు. చాలాకాలం వరకూ చిరు ట్విట్టర్‌లో ఎవరిని ఫాలో అవ్వలేదు. తాజాగా చిరు ప్రముఖ సినీ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రిని తన ట్విట్టర్‌లో ఫాలో అవ్వడం ప్రారంభించారు. ఈ విషయాన్ని ఓ అభిమాని రామ జోగయ్య శాస్త్రికి తెలియజేశారు. దీని స్పందించిన రామ జోగయ్య శాస్త్రి ‘ఈ మెగా ప్రేమకి ఎప్పటికీ రుణపడి ఉంటాను.. కొండంత సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, తొలి సాంగ్ ‘లాహె లాహె’ని ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది మే 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fBwrDe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...