Monday, 8 March 2021

అందుకే జగన్‌ను 11 ఏళ్లుగా ఫాలో అవుతున్నా.. పదవి కోసం కాదు: పోసాని కృష్ణమురళి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిజాయితీపరుడు కాబట్టే తాను 11 ఏళ్లుగా ఆయన్ను ఫాలో అవుతున్నానని ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. వైయస్‌ జగన్‌ పార్టీ పెట్టినప్పటి నుంచీ ఆయన్ని చూస్తున్నానని, చాలా నిజాయతీగా వ్యవహరిస్తున్నారని పోసాని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పోసాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైయస్ జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ‘‘2014 ఎన్నికల సమయంలో కొందరు కార్యకర్తలు వచ్చి.. అన్నా, ఓటర్లకు రూ.1000, రూ.500 చొప్పున డబ్బులు పంచుతున్నారు, మనం కూడా ఎంతో కొంత డబ్బులు ఇద్దాం అని వైయస్‌ జగన్‌తో అన్నారు. దానికి ఆయన ఏమన్నారో తెలుసా.. మనం కూడా డబ్బులు పంచితే ఇక రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. ఓటర్లకు డబ్బులు ఇస్తే మనం రాజకీయాల్లో పనికిరామని, మన పార్టీ కూడా రాంగ్‌ రూట్లో వెళ్తుందని ఆ రోజు చెప్పారు. ఆ మాటలు విన్న తరువాత నాకు ఆశ్చర్యమనిపించింది. ఆయనలో ఇంత పరిణితి చెందిన రాజకీయ నాయకుడు ఉన్నాడా అనిపించింది’’ అని పోసాని చెప్పుకొచ్చారు. వైయస్ జగన్‌ను మాట్లాడితే చంద్రబాబు ఫేక్ సీఎం అని అంటారని.. అసలు ఫేక్ సీఎం అంటే ఏంటి అని తాను చాలా మంది మేధావులను అడిగానని పోసాని వెటకారంగా అన్నారు. మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఫేక్ సీఎం అని పోసాని అభివర్ణించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్నారు పోసాని. ఎన్నికల్లో గెలవలేరు కాబట్టే చంద్రబాబు వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని, ఫ్రస్టేషన్‌కు గురవుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై జగన్‌కు ఉన్న మేదస్సు, అవగాహన గురించి పోసాని చెబుతూ.. ‘‘జగన్‌ పాదయాత్రలో నేను పాల్గొన్నాను. భీమవరం వద్ద నా చేయి పట్టుకొని ఆయన నడిచారు. అన్నా.. వైయస్‌ రాజశేఖరరెడ్డి గారు ఆ రోజు రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చారు. రుణాలు మాఫీ చేశారు. మీరు కూడా ఇలాంటివి ఏమైనా చేస్తారా? మనం ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుంది అని అన్నాను. ఆ రోజు ఆయన నాతో.. మురళీ, మన రాష్ట్ర బడ్జెట్‌ ఎంతా? మా నాన్న వైయస్‌ఆర్‌ ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వేరు.. ఇప్పుడు ఏపీ పరిస్థితి వేరు అన్నారు. చంద్రబాబు ఈ ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని.. అన్ని అబద్ధాలు మనం చెప్పలేమని ఆ రోజు జగన్ చెప్పారు’’ అని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు చెబుతారు కానీ చేయరని.. మనం చెబితే చేస్తామని ఆరోజు తనతో వైయస్ జగన్ చెప్పినట్టు పోసాని తెలిపారు. ప్రజలు ఏమి చేయగలమో అదే ప్రచారంలో చెబుదామని అప్పుడు జగన్ తనతో అన్నట్టు వెల్లడించారు. ‘‘జగన్ మాటలు విన్న తరువాత ఆయన చాలా స్ట్రాంగ్‌ అని నమ్మాను. నేనేదో పదవి కోసమో.. ఇంకో దాని కోసమే కాకాపట్టలేదు. ఇలాంటి సుగుణాలు ఉన్న వైయస్‌ జగన్‌ రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు నిజాలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యారు’’ అని పోసాని ప్రశంసల వర్షం కురిపించారు. మరోవైపు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై కూడా పోసాని విమర్శలు గుప్పించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలను ప్రజలు నమ్మడం లేదన్నారు. వ్యక్తిగత కక్షతో పవన్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. జగన్‌ చెప్పేది నిజమని ప్రజలు నమ్మి ఆయన్ని తమ గుండెల్లో పెట్టుకుంటే ఈ రాష్ట్రాన్ని ఒక దేవాలయంగా ఆయన మారుస్తారని పోసాని హామీ ఇచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30oxlu4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...