Thursday, 28 May 2020

అన్ని అంశాలపై త్వరలో నిర్ణయం.. సినీ ఇండస్ట్రీకి మంత్రి తలసాని తీపి కబురు

సినిమా, టీవీ షూటింగ్‌లకు త్వరలోనే నిబంధనలతో కూడిన అనుమతుల మంజూరుకు తగు చర్యలు చేపట్టనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గురువారం MCHRDలో సినిమా, టీవీ షూటింగ్‌లకు అనుమతులు, థియేటర్‌ల ఓపెనింగ్ తదితర అంశాలపై సినీ, టీవీ రంగాలకు చెందిన వివిధ అసోసియేషన్‌ల ప్రతినిధులతో మంత్రి తలసాని, హోం శాఖ కార్యదర్శి రవిగుప్తా, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబు సంయుక్త సమావేశం నిర్వహించారు. Also Read: ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు షూటింగ్ ప్రదేశాలలో, థియేటర్‌లలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తూ మంత్రికి వినతిని అందజేశారు. అలాగే ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుండి వచ్చే ఆర్టిస్టులకు ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక పాసులు మంజూరు చేయాలని కోరారు. రాత్రి వేళలో కర్ఫ్యూ అమలు చేస్తున్న కారణంగా షూటింగ్ ముగిసిన అనంతరం రాత్రి సమయాలలో ఆర్టిస్టులు, సిబ్బంది తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొనగా.. పోలీసు శాఖకు దరఖాస్తు చేస్తే ఈ పాస్‌లు మంజూరు చేయనున్నట్లు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రవిగుప్తా వివరించారు. సినీ రంగ ప్రతినిధులు ప్రస్తావించిన పలు అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. థియేటర్‌లను తెరిచిన అనంతరం ఎదురయ్యే సమస్యలు కూడా చర్చకు వచ్చాయి. షూటింగ్ ప్రాంతాలలో తీసుకోవాల్సిన వ్యక్తిగత జాగ్రత్తలు, ఏర్పాట్లపై కూడా చర్చించారు. ప్రభుత్వం సూచించే మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటిస్తామని సమావేశంలో పాల్గొన్న సినీ, టీవీ రంగ ప్రతినిధులు స్పష్టం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సినీ రంగానికి చెందిన ఏ విషయమైనా ప్రభుత్వం ఎప్పుడూ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. Also Read: అసోసియేషన్ ప్రతినిధులు అందజేసిన సూచనలు, వినతులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో షూటింగ్‌లకు అనుమతులు, థియేటర్ ఓపెనింగ్ అంశాలే కాకుండా సినిమా థియేటర్‌లకు ప్రత్యేక విద్యుత్ టారీఫ్, ఫ్లెక్సీ టికెటింగ్ ధరలు, అన్‌లైన్ టికెటింగ్ విధానం, కళాకారులకు పెన్షన్‌లు, తెల్ల రేషన్ కార్డులు తదితర అంశాలపై చర్చ జరిగింది. వీటిపై మంత్రి మాట్లాడుతూ ఈ అంశాలను సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం రూపొందిస్తున్న బెస్ట్ పాలసీలో పొందుపరుస్తామని మంత్రి వివరించారు. సమావేశంలో చర్చించిన అంశాలు, నిర్ణయాలపై నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి ఆమోదం కొరకు పంపిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నటుడు, నిర్మాత అక్కినేని నాగార్జున, దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి, ఎన్.శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు సి.కళ్యాణ్, కె.ఎస్.రామారావు, సురేష్ బాబు, ‘మా’ అధ్యక్షుడు నరేష్, అసోసియేషన్ ప్రతినిధులు దామోదర్ ప్రసాద్, సుప్రియ, టీవీ చానళ్ళ ప్రతినిధులు బాపినీడు, జెమిని కిరణ్, ఎగ్జిబిటర్స్ ప్రతినిధులు విజయేందర్ రెడ్డి, సునీల్ నారంగ్, తెలంగాణ రాష్ట్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మురళీ మోహన్, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2zF8qIT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...