Sunday, 14 March 2021

నాది పెరుమాళ్లపల్లి.. డిగ్రీ చదివాను: ‘శ్రీకారం’ డైరెక్టర్ కిశోర్ ఇంటర్వ్యూ

‘‘వ్యవసాయం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ మా ‘శ్రీకారం’ సినిమాలో ఎవరూ చెప్పని, చూపించిన విషయాలను ప్రస్తావించాం. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు దర్శకుడు కిశోర్‌. శర్వానంద్‌ హీరోగా కిశోర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్రీకారం’. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సందర్భంగా ఈ దర్శకుడు కిశోర్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు... ✦ మాది చిత్తూరు జిల్లా, పెరుమాళ్లపల్లి గ్రామం. ఫస్ట్‌ నేను హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేద్దామని అనుకున్నాను. మా ఇంట్లో వద్దు అన్నారు. ఆ తర్వాత సినిమాల్లోకి వెళతానని చెప్పాను. ముందు డిగ్రీ పూర్తి చేయమన్నారు. డిగ్రీ కంప్లీట్‌ చేశాక ఇండస్ట్రీకి వచ్చాను. ఓ డిస్ట్రిబ్యూటర్‌ సహాయంతో ఇండస్ట్రీలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేశాను. ✦ ‘లవ్‌.డామ్’, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశాను. అప్పట్లో ఓ కన్నడ సినిమాకు కూడా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాను. ఆ తర్వాత కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్ చేశాను. ✦ 2016లో నేను తీసిన ‘శ్రీకారం’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ చూసి ఇదొక సినిమా కంటెంట్‌ అని చాలామంది అన్నారు. ఆ తర్వాత 14 రీల్స్‌ ప్లస్‌లో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఓ పెద్ద ప్రొడక్షన్‌ హౌస్‌లో దర్శకుడిగా నా తొలి సినిమా ఉండటం చాలా సంతోషంగా అనిపించింది. అలాగే నా ఫస్ట్‌ సినిమా ఫంక్షన్స్‌కు చిరంజీవి గారు, కేటీఆర్‌ గారు రావడం చాలా హ్యాపీ. అలాగే సోషల్‌ మీడియా ద్వారా మా సినిమాను ప్రోత్సహించిన, మెచ్చుకున్న సెలబ్రిటీలకు ప్రత్యేక ధన్యవాదాలు. తొలి రోజు నుంచే మా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి గౌరవం కూడా లభిస్తుంది. ఇందుకు కారణమైన మా నిర్మాతలకు ధన్యవాదాలు. ‘శ్రీకారం’ సినిమా సక్సెస్‌ క్రెడిట్‌లో వారిదే ముఖ్యభాగం. ✦ నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ‘శ్రీకారం’ సినిమా ఆలోచన వచ్చింది. వ్యవసాయం బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలు వచ్చాయి. క్రికెట్, ప్రేమ లాంటి అంశాల మీద చాలా సినిమాలు వచ్చాయి. అలాగే వ్యవసాయం మీద కూడా వచ్చాయి. కానీ మా సినిమాలో ఎవరూ చెప్పని పాయింట్‌ను టచ్‌ చేశాం. ఈ పాయింట్‌కు ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతున్నారు. మా సినిమాను చూసేందుకు గ్రామాల నుండి ట్రాక్టర్స్‌లో థియేటర్స్‌కు వెళుతున్నారు. ఆడియన్స్‌ అంతా కనెక్ట్‌ అయ్యారు. ఎమోషన్స్‌ నా బలం అనుకుంటున్నాను. ✦ శర్వానంద్‌ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌లో సెటిల్డ్‌ పెర్ఫార్మెన్స్‌ చేశారు. అలాగే రావు రమేష్, సాయికుమార్, సీనియర్‌ నరేష్‌ క్యారెక్టర్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. సత్య కామెడీ ట్రాక్‌ కూడా ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. ఈ సినిమా కోసం 40 ఎకరాల భూమిని తీసుకుని అందులో నిజంగా పంటలు పండించి, కొన్ని సన్నివేశాలను షూట్‌ చేశాం. ఇందుకు నిర్మాతలు రామ్‌ ఆచంట గారికి, గోపి ఆచంట గారికి ధన్యవాదాలు. అలాగే హీరోయిన్‌ ప్రియాంక అరుల్‌ మోహన్‌ తన నటనతో మెప్పించింది. ✦ నా మొదటి సినిమా థియేటర్స్‌లోకి రావడానికి నాలుగేళ్లు పట్టింది. ఏంటి? ఇంత సమయం పట్టింది అనుకున్నా. కానీ మా నిర్మాతలు తొలి సినిమాను తీసేందుకు దాదాపు ఏడేళ్లు వెయిట్‌ చేశారని తెలిసి చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించింది. ✦ ఈ సినిమాను చూసి చాలా మంది ఫోన్‌ చేశారు. దర్శకులు హరీష్‌శంకర్, కృష్ణచైతన్య, సాగర్‌ కె చంద్ర ఇలా చాలా మంది యంగ్‌ డైరెక్టర్స్‌ ఫోన్‌ చేసి అభినందించారు. అలాగే దర్శకులు అజయ్‌ భూపతి, బాబీ, గోపీచంద్‌ మలినేని.. ‘శ్రీకారం’ సినిమాను మీడియా ముఖంగా అభినందించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ✦ నా తర్వాత సినిమా యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ‘శ్రీకారం’ సినిమాకు కంప్లీట్‌ డిఫరెంట్‌. నాకు మైథలాజికల్‌ సినిమాలు అంటే ఇష్టం. భవిష్యత్‌లో అలాంటి సినిమా చేస్తాను.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tiGOzz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...