ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ మంగళవారం కొవిడ్ 19 వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ప్రజలు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని తన ట్వీట్ ద్వారా ఆయన ప్రోత్సహించారు. మన కోసం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ల భద్రత కోసం కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. అదే సమయంలో తన రాజకీయ ప్రత్యర్థులకు చురక అంటించారు. తమిళంలో ట్వీట్ చేసిన కమల్ హాసన్.. ‘‘శ్రీ రామచంద్ర హాస్పిటల్లో నేను కరోనావైరస్ వ్యాక్సిన్ వేయించుకున్నాను. తమతో పాటు ఇతరుల భద్రత కోసం ఆలోచించేవారు కచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇప్పుడు మీరు కొవిడ్ 19 వ్యాక్సిన్ వేయించుకుంటే, వచ్చే నెలలో అవినీతికి మనందరం వ్యాక్సిన్ వేయొచ్చు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ తన సినిమా షూటింగ్లకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తన పార్టీ కోసం కమల్ హాసన్ ప్రచారం చేస్తున్నారు. వచ్చే నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీధి మయ్యమ్ (ఎంఎన్ఎం) పోటీ చేస్తోంది. కాగా, రెండో దశ కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. 60 ఏళ్లు పైబడివారికి దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిన్న వ్యాక్సిన్ వేయించుకున్నారు. వారి తరవాత కమల్ హాసన్ కూడా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ వయసు 66 సంవత్సరాలు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dURCj0
v
No comments:
Post a Comment