‘పుష్ప’ షూటింగ్ స్పాట్ నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లగ్జరీ వానిటీ వ్యాన్ను లారీ వెనుక నుంచి ఢీకొట్టిన సంగతి తెలిసిందే. రంపచోడవరం నుంచి హైదరాబాద్కు వస్తోన్న వానిటీ వ్యాన్ను ఖమ్మం సమీపంలో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాలేదని ఆదివారం పోలీసులు వెల్లడించారు. సత్యనారాయణపురం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో వ్యాన్ వెనుక భాగం పాక్షికంగా దెబ్బతిన్నదని చెప్పారు. ప్రమాద సమయంలో వ్యాన్లో అల్లు అర్జున్ కానీ, ఆయన మేకప్ టీమ్ కానీ లేరని పోలీసులు స్పష్టం చేశారు. ప్రమాద సమయంలో వ్యాన్లో డ్రైవర్, ఒక అటెండెంట్ మాత్రమే ఉన్నారన్నారు. బన్నీ వానిటీ వ్యాన్ డ్రైవర్ ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. ఇదిలా ఉంటే, సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా రూపొందుతోంది. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి, రంపచోడవరం ప్రాంతాల్లో మూడు నెలలపాటు షూటింగ్ జరిపారు. సినిమాలో కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. ఇటీవలే ఇక్కడ షూటింగ్ను పూర్తిచేసుకుని అల్లు అర్జున్ హైదరాబాద్ వెళ్లారు. చివరిగా రంపచోడవరంలో అభిమానులను కలిశారు. ఏజెన్సీలో షూటింగ్ పూర్తయినట్టు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. షూటింగ్కు సహకరించినవారికి కృతజ్ఞతలు తెలియజేసింది. ‘‘మారేడుమిల్లి, రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల్లో ‘పుష్ప’ సినిమాకు సంబంధించి గతేడాది నవంబర్ నుంచి ఈ సంవత్సరం జనవరి మధ్య రెండు భారీ షెడ్యూల్స్ను పూర్తి చేశాం. సినిమా షూటింగ్కు సహకరించిన ఆదివాసీలు, అధికారులకు ధన్యవాదాలు. వారి సహకారం లేకుండా చిత్రీకరణ సజావుగా సాగేది కాదు. షూటింగ్ కోసం మళ్లీ ఇక్కడకు తప్పకుండా వస్తాం’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jrz0aY
v
No comments:
Post a Comment