విశాఖపట్నంలోని ఆర్.ఆర్.వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి ప్రమాదరక స్టైరీన్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ విషాదకర ఘటనలో ఇప్పటికే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వందల మంది హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. కాగా, ఈ దుర్ఘటనపై దేశం నలుమూలల నుంచి స్పందన వస్తోంది. విశాఖ బాధితులు కోలుకోవాలని ప్రతి ఒక్కరూ దేవుడిని ప్రార్థిస్తున్నారు. వీరిలో టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇప్పటికే చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తదితరులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి, రామ్ చరణ్, రవితేజ సహా పలువురు టాలీవుడ్ స్టార్లు స్పందించారు. ‘‘వైజాగ్ గ్యాస్ లీక్ ఘటన దృశ్యాలు కలచివేస్తున్నాయి. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నవారు కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈ ఘటనలో తమ బంధువులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని రాజమౌళి ట్వీట్ చేశారు. ‘‘వైజాగ్ గ్యాస్ లీక్ ఘటన దృశ్యాలు చూస్తుంటే గుండె బద్దలైపోతోంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అస్వస్థతకు గురైన ప్రజలు వీలైనంత త్వరగా కోలుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నారని భావిస్తున్నాను. వైజాగ్ ప్రజలను ఆ దేవుడు కాపాడాలని ప్రార్థిస్తున్నాను’’ అని రామ్ చరణ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ‘‘వైజాగ్ గ్యాస్ లీక్ వార్త విని చాలా బాధపడ్డాను. ఈ ఏడాది దారుణంగా ఉందని ఈరోజు కూడా నిరూపించింది. మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మిగిలిన వారంతా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నా’’ అని రవితేజ ట్వీట్ చేశారు. వీరితో పాటు నాని, రామ్ పోతినేని, సాయి ధరమ్ తేజ్, అఖిల్ అక్కినేని, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, సునీల్, ఈషా రెబ్బా, శ్రీముఖి, కొరటాల శివ, అల్లు శిరీష్, నిధి అగర్వాల్, తమన్, ప్రణీత తదితరులు విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. వీరంతా ట్విట్టర్ ద్వారా మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2yzNSRH
v
No comments:
Post a Comment