బర్నింగ్ స్టార్ ఇటీవలే ‘కొబ్బరి మట్ట’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. తన నాన్స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు. చాంతాడంత డైలాగులను అవలీలగా చెప్పేస్తూ వహ్వా అనిపించుకుంటున్నారు. ఇదిలా ఉంటే, సినిమా ద్వారా తాను సంపాదిస్తున్న దానిలో కొద్ది మొత్తాన్ని సంపూ సామాజిక కార్యక్రమాలకు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, కేరళలో గతంలో వరదలు వచ్చినప్పుడు సంపూ విరాళాలు అందజేసి తన పెద్ద మనసు చాటుకున్నారు. తాజాగా మరోసారి ఆయన వరద బాధితుల సహాయార్థం విరాళం ఇచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటకలోని చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. బెళగావి, కొడుగు జిల్లాలతోపాటు బాగల్కోడ్, రాయచూర్, ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటక, యాద్గిర్, శివమొగ్గ, చిక్మగుళూరు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటి వరకూ రెండు లక్షల మందిని ప్రభుత్వం పునరావాస కేంద్రాలకు తరలించింది. వరద బాధితుల సహాయార్థం విరాళాలు అందజేయాలని కర్ణాటక ప్రభుత్వం కోరుతోంది. ఇప్పటికే చాలా మంది కర్ణాటక సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు అందజేస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా హీరో సంపూర్ణేష్ బాబు చేరారు. వరద బాధితుల కోసం రూ.2 లక్షల విరాళం అందజేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఫేస్బుక్ ద్వారా వెల్లడించారు. ‘‘ఉత్తర కర్ణాటకలో వరదలు నన్ను కలిచివేసింది. కన్నడ ప్రజలు తెలుగు సినిమాని దశాబ్దాలుగా ఆదరిస్తున్నారు. నన్ను కూడా హృదయకాలేయం నుంచి ఎంతగానో ప్రేమిస్తున్నారు. వరదల తాలూకు ఫోటోలు చూసి చాలా బాధవేసింది. నా వంతుగా 2 లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయనిదికి ప్రకటిస్తున్నాను’’ అని సంపూ ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31xJKdR
v
No comments:
Post a Comment