తెలుగు సినీ పరిశ్రమ మరో ఆణిముత్యాన్ని కోల్పోయింది. ప్రముఖ సినీ గేయ, మాటల రచయిత వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ కన్నుమూశారు. చెన్నైలో ఆయన హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు ప్రకటించారు. డబ్బింగ్ చిత్రాలకు పాటలు రాయడం ద్వారా వెన్నెలకంటి ప్రసిద్ధి పొందారు. పాటలు రాయడంతో పాటు పలు డబ్బింగ్ సినిమాలకు మాటలు, స్క్రిప్ట్ రైటర్గా కూడా వెన్నెలకంటి సేవలందించారు. 11 యేళ్ళ వయసులో ఆటవెలదిలో ‘భక్త దుఃఖనాశ పార్వతీశ’ మకుటంత శతకం రాసిన వెన్నెలకంటి.. 13 సంవత్సరాల వయసులో లలితా శతకం రాశారు. ‘శ్రీరామచంద్రుడు’ సినిమాతో గీత రచయితగా సినీ ప్రస్థానం ప్రారంభించారు. 1979లో చంద్రగిరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న సమయంలో సినీ నటుడు ప్రభాకర్ రెడ్డి ప్రోత్సాహంతో వెన్నెలకంటి సినీరంగంలో అడుగుపెట్టారు. బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి సినీ గేయ రచయితగా స్థిరపడ్డారు. దాదాపు రెండు వేల పాటలు రాశారు. ‘ఆదిత్య 369’, ‘ఘరానా అల్లుడు’, ‘ఘరానా బుల్లోడు’, ‘క్రిమినల్’, ‘శ్రీ కృష్ణార్జున విజయం’, ‘సమరసింహారెడ్డి’, ‘శీను’ వంటి చిత్రాల్లో మంచి పాటలు రాశారు. ఆయన చివరిగా ‘పెంగ్విన్’ సినిమాకు పనిచేశారు. కాగా, దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ప్రముఖ నటుడు కమల్ హాసన్తో వెన్నెలకంటికి అవినాభావ సంబంధం ఉంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూయడానికి ముందు కరోనాపై ఆయన పాడిన పాటను కూడా వెన్నెలకంటి రాజేశ్వరరావే రాశారు. ఇక కమల్ హాసన్ అనువాద చిత్రాలు ‘పంచతంత్రం’, ‘పోతురాజు’, ‘ముంబై ఎక్స్ప్రెస్’, ‘దశావతారం’, ‘మన్మథభాణం’ సహా తమిళం నుంచి అనువాదమైన ‘సరోజ’, ‘ప్రేమ ఖైదీ’ సినిమాలకు కూడా వెన్నెలకంటి మాటలు రాశారు. ఇదిలా ఉంటే, వెన్నెలకంటికి ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు శశాంక్ వెన్నెలకంటి కూడా మాటల రచయితగా రాణిస్తున్నారు. ఈయన సైతం డబ్బింగ్ సినిమాలకు మాటలు అందిస్తున్నారు. చిన్న కుమారుడు రాకేందుమౌళి పాటల రచయితగా, గాయకుడిగా రాణిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LkqKwv
v
No comments:
Post a Comment